||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరువది ఆరవ సర్గ ||

||సీతాదేవి దుఃఖము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షడ్వింశస్సర్గః

తత్త్వదీపిక
సీతాదేవి దుఃఖము

పదహేను పదహారవ సర్గలలో దుఃఖములో వున్న సీతాదేవి వర్ణన వింటాము.
సీత కార్యము ఫలించని ఆశవలె,
అసత్యమగు అపవాదము చే చెడిపోయిన కీర్తివలె,
తరిగిపోయిన ఐశ్వర్యమువలె వున్నది అని.
అది వాల్మీకి వర్ణన.

ఈ సర్గలో ఆ దుఃఖములో వున్న సీతాదేవి మనస్సులో మాటలు
వాల్మీకి ద్వారామనము వింటాము. .

"అహమ్ జీవితుం న ఉత్సహే"
"నాకు జీవించుటకు ఉత్సాహములేదు"

ఎందుకు?

"రామునియొక్క ఏమరపాటు సమయములో
కామరూపుడగు రాక్షసుడు రావణుని చేత
ఆక్రోశించుచున్న నేను బలాత్కారముగా తీసుకురాబడితిని.
రాక్షసస్త్రీల వశములో సుదారుణమైన విధముగా భయపెట్టబడుతూ,
మహారథుడైన రాముడుకి దూరముగా రాక్షసులమధ్యలో నివసిస్తున్న,
నా జీవితమునకు అర్థములేదు.
సంపదలు ఆభరణములకు కూడా అర్థములేదు".

జీవించుటకు ఉత్సాహములేక పోయినా బతికి ఉన్నందుకు కారణములు ఏమిటి?

"ఈ దుఃఖముతో ముక్కలు కాని నా హృదయము
తప్పక ఇనుపరాతితో చేయబడినదై ఉండాలి,
లేక నాశనము లేనిదై ఉండాలి.
ఆయన లేకుండా ఒక క్షణము కూడా జీవిసున్నాను అంటే,
అనార్యురాలగు నేను దుష్టురాలినే.
నేను పాపిని.
పాతివ్రత్యములేని స్త్రీని.
సాగరముల చివరి దాకా కల భూమి అంతకూ రాజు ,
ప్రియంవదుడు అయిన రాముడు లేకుండా
నాకు జీవించడములో సుఖములమీద మమకారము మీద శ్రద్ధలేదు".

అప్పుడు సీత చేసుకున్న నిర్ణయము ఏమిటి.

"నేను ఈ శరీరము వదిలెదను.
ముక్కలు చేయబడినా, తినబడినా కాని
ప్రియుని కి దూరముగా ఉన్న నేను ఈ దుఃఖమును సహించలేను.
ఈ గర్హింపతగిన నిశాచరుడు అయిన రావణుని,
ఎడమ కాలితో కూడా తాకను.
అట్టివాడిని ప్రేమించడమనే మాటలేదు.
నన్ను ప్రార్థిస్తున్న ఈ కౄరకర్ముడుకి తన మర్యాదపోవుచున్నదని కాని,
తన వంశ ప్రతిష్ఠలు పోతాయి అని గాని తెలియదు.
చిన్నాభిన్నము చేసినా, అగ్నిలో పడవేసినా రావణునికి వశముకాను".

అప్పుడు మళ్ళీ సీత ఆలోచనలు మనస్సులో ఎల్లప్పుడూ వున్న రాముడిపై మళ్ళు తాయి.

"రాముడు ప్రఖ్యాతి గలవాడు.
జ్ఞానము కలవాడు. కృతజ్ఞుడు.
సద్వృత్తి కలవాడు.
అట్టి జాలికలవాడు నా భాగ్య సంపద క్షీణించడముతో,
నాపై జాలిలేనివాడు అయ్యెను కాబోలు.

"ఎవరైతే జనస్థానములో పదునాలుగు వేల రాక్షసులను ఒక్కడే సంహరించెనో,
అట్టి రాముడునన్ను ఎందుకు రక్షించుటలేదు?"

"ఎవరైతే దండకారణ్యములో రాక్షసపుంగవులైన విరాధుని చంపెనో,
అట్టి రాముడు నన్ను ఎందుకు రక్షించుటలేదు?"

"సముద్రము మధ్యలోవున్న ఈ లంక భేధించుటకు కష్టమే అయినా
రాఘవుని బాణములకు గతిరోధము ఏమీలేదు.
ఏమిటా కారణము దానిచేత ధృఢపరాక్రముడైన రాముడు
రాక్షసులచే అపహరింపబడిన తన ప్రియమైన భార్యను రక్షించి తీసుకొనిపోవుటలేదు?"

"లక్ష్మణుని అగ్రజునికి నేను ఇక్కడ ఉన్నానని తెలియదేమో అని నా శంక.
తెలిసివుంటే ఆ తేజస్వి ఈ దుశ్చర్యను సహిస్తాడా?"

"అపహరింపబడి నేను ఎవరినినైతే దాటి వచ్చితినో,
ఎవరైతే రాఘవునకు అవిషయము చెప్పగలరో అట్టి గృధరాజు,
రావణుని చేత యుద్ధములో చంపబడెను.
తీసుకొని పోబడుతున్న నన్నురక్షించుటకు ముసలివాడైన
రావణుని తో ద్వంద్వయుద్దములో నిలబడిన జటాయువు
నిజముగా మహత్తరమైన పని చేసెను".

"ఆ రాఘవుడు నేను ఇక్కడ ఉన్నాని తెలిస్తే
అప్పుడు క్రోధముతో ఈ లోకమును
రాక్షసులందరినుంచి తనబాణములతో విముక్తి చేయును,
లంకాపురిని నాశనము చేయును,
సాగరములోని జలమును క్షీణింపచేయును,
నీచుడైన రావణుని కీర్తిని నామరూపములు లేకుండా చేయును".

రావణుని తో "తపసశ్చ అనుపాలనాత్"
అంటే "తాపసధర్మము పాలిస్తూ" నిన్నుదహించుట లేదు అనిన సీత ,
ఎవరూ లేనప్పుడు తనకోపము అదుపులో ఉంచుకోలేక చెప్పిన మాటలు కూడా వింటాము.
తాపసుల దుఃఖములో జనించిన కోపము లో వచ్చేమాటలు,
శాపాల లాగా వుంటాయి.
ఇక్కడ సీత మాటలు అలాంటివే.

"ఇప్పుడు నేను ఎలాగ విలపిస్తున్నానో అలాగే
ఇక్కడ చనిపోయిన నాథులకోసము ప్రతిగృహములో విలపిస్తున్న స్త్రీలు ఉండెదరు.
అందులో సంశయములేదు".

"లక్ష్మణసమేతుడైన రాముడు రాక్షసుల లంకను కనుగొనినచో,
వారిచేత చూడబడిన శత్రువులు ఒక క్షణము కూడా నివశింపలేరు".

"ఈ లంక అచిరకాలములో,
శ్మశానములో మండుతున్న చితుల పొగతో సమానమైన పొగతో నిండి ఉండును".

"ఈ లంకలో ఎలాంటి దుశ్శకునములు కనపడుచున్నవో,
వాటితో ఈ లంకయొక్క శోభ అచిరకాలములోనే పోవును అని తెలియుచున్నది".

"పాపాత్ముడు అధముడు అయిన రావణుడు చనిపోగా
ఈ అజేయమైన లంక కూడా వైధవ్యము కలిగిన స్త్రీవలె శోషించిపోవును".

"పుణ్యోత్సవములతో నిండిన లంక, భర్తపోయిన స్త్రీవలె అగును".

"అతికొద్దికాలములో నే ఇక్కడ ప్రతి గృహములో
విలపించుచున్న రాక్షసకన్యల రోదనలను తప్పక వినెదను".

"రాముని బాణములతో రాక్షస వీరులందరూ చంపబడగా,
లంకానగరము దగ్ధమైపోయి
తన శోభనుకోలుపోయి చీకట్లలో అంధకారమయము అయిపోవును".

"ఎఱ్ఱని కళ్ళుగల రామునికి
నేను రావణుని అంతఃపురములో ఉన్నాననితెలిసినచో ,
ఈ అధముడు నాకు పెట్టిన గడువు అదే అతనికి పెట్టబడిన కాలము అగును".

"నాకు విధించిన ఆ మృత్యువు ఆ దుష్ఠునకు వర్తించును".

"ఈ పాపాత్ములకు చేయకూడని పనులు తెలియవు.
అధర్మమైన పనుల వలన మహత్తరమైన పాతకము కలుగును".

మళ్ళీ దుఃఖములో వున్న సీత ఆలోచనలు తన స్థితిమీద మళ్ళుతాయి.

"పిశితాశనులైన ఈ రాక్షసులకు ధర్మము తెలియదు.
ఈ రాక్షసులు తప్పక నన్ను ప్రాతఃకాల భోజనముగా వాడుకొందురు.
ఆ ప్రియదర్శనుడగు రాముడు లేకుండా ఏమి చేయగలను.
ఆ ఎఱ్ఱటి కళ్ళు గల రాముని చూడలేక మంచి దుఃఖములో ఉన్నదానను ".

"ఇవాళ నాకు విషము ప్రదానము చేయగలవాడు ఉన్నచో
పతి లేకపోయిన నేను యముని చూచుటకు సిద్ధముగా నున్నాను".

"స్త్రీనైన నేను నా భర్త ఎడబాటుతో జీవించుతున్నాను అంటే
నాలోన ఏవో గుణములు లోపిస్తున్నయా?
నా భాగ్యము క్షీణించిపోయినదా?
శూరుడు శత్రువులను నిర్మూలించువాడు, మహాత్ముడు అయిన
రాముని విడిచి ఉండడముకన్న మరణించడమే శ్రేయము".

"లేక ఆ నరశ్రేష్ఠులిద్దరూ శస్త్రములను విసర్జించి
వనములో ఫలములమీద వనగోచరులులాగా జీవిస్తున్నారేమో.
లేక రామలక్ష్మణులు అన్నదమ్ములైన శూరులిద్దరూ
దురాత్ముడైన రావణునిచేత కపటముగా చంపబడిరేమో.
ఇలాంటి స్థితిలో అన్నివిధములుగా మరణించుటకు కోరుకొనుచున్నాను.
ఈ దుఃఖములో కూడా మృత్యువు సంభవము కాదు".

"ప్రియుడు ఆత్మను ఎరిగిన రాముని ఎడబాసి
పాపి రావణుని వశమైన నేను నా ప్రాణములను వదిలెదను".

ఈ విధముగా దుఃఖములో ఉన్న సీత అలోచనలను వినిపిస్తాడు వాల్మీకి.

యోగవాశిష్టములో మన ఆలోచనలే మన దుఃఖమునకు కారణము అని వింటాము.
దుఃఖములో ఉన్న అలోచనలే దుఃఖాన్ని అధికము చేస్తాయి.
అదే ఇక్కడ చూస్తాము.

అదే చివరిమాటగా వినిపిస్తాడు.

"మహాత్ములు పాపరహితులు జితేంద్రియులు అయిన మహాభాగులు ధర్మాత్ములు.
వారికి ప్రియములు అప్రియములు ఉండవు.
ఎవరికి ప్రియమైన దానినుంచి దుఃఖము,
అప్రియమునుంచి అధిమైన భయము కలగదో,
ఎవరు వీటినుంచి అతీతులో ఆ మహాత్ములకు నా నమస్కారము".

ఎంతదుఃఖము వచ్చినా,
ఎంత సుఖము కలిగినా,
ఆ ద్వంద్వాలకి అతీతులుగా వుండాలి అన్నదే
తత్త్వదీపిక ఇరవై ఆరవ సర్గలో వినపడే ధ్వని.

ఈవిధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది ఆరవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||